ఆదేశించిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్రంలో పర్యాటక స్థలాలను గుర్తించి వాటిని అభివృద్ది చేసేందుకు దృష్టి సారించాలని ఆదేశించారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. అంతే కాకుండా పర్యాటకులను ఆకట్టుకునేలా వైవిధ్యం కలిగిన స్థలాలను ముందుగా గుర్తించాలని స్పష్టం చేశారు. వాటి చరిత్ర, ప్రాశస్త్యం గురించి కూడా పర్యాటకులు తెలుసుకునేలా ఉండాలని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు.
రాష్ట్రంలో అటవీ అందాలు, వన్య ప్రాణులు, వలస వచ్చే విదేశీ పక్షులు, విభిన్న జీవ వైవిధ్యమున్న ప్రాంతాలు, హెరిటేజ్ ప్రదేశాలు, సంస్కృతికి అద్దం పట్టే స్టలాలను గుర్తించి వాటన్నింటినీ పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దాలను ఆదేశించారు.
ఉత్తర తెలంగాణలో కవ్వాల్, దక్షిణ తెలంగాణ వైపు అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చి దిద్దేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. వన్య ప్రాణులకు హాని కలిగించకుండా ప్రత్యేక పర్యాటక విధానం ఉండాలని స్పష్టం చేశారు ఎనుముల రేవంత్ రెడ్డి.
రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సచివాలయంలో అటవీ శాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశం అధికారులను ఆదేశించారు.