ఆదేశించిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్రానికి సంబంధించి మెరుగైన పర్యాటరంగ పాలసీని తయారు చేయాలని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. దేవాదాయ, ధర్మాదాయ శాఖపై సమీక్షించారు. ఫిబ్రవరి 10 లోపు మెరుగైన, భారీ ఆదాయం వచ్చేలా పాలసీ ఉండాలని ఆదేశించారు. పాలసీ తయారు చేసే కంటే ముందు సింగపూర్ టూరిజం పాలసీని అధ్యయనం చేయాలని సూచించారు. అక్కడి ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అద్భుతంగా మార్చేసిందని, అత్యధిక ఆదాయం వీటి ద్వారానే వస్తుందన్నారు రేవంత్ రెడ్డి.
ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస రాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ హాజరయ్యారు. కీలక సూచనలు చేశారు సీఎం.
ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. దేశ, విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేసి పాలసీని రూపొందించాలని స్పష్టం చేశారు. ఎకో, టెంపుల్ టూరిజంపై ఎక్కువగా దృష్టి పెట్టాలన్నారు. ఆదిలాబాద్, వరంగల్, నాగార్జున సాగర్ వంటి ప్రాంతాలలో ఎకో టూరిజంను మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు సీఎం.