ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కామెంట్స్
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. పీఎంగా పని చేసిన పీవీ నరసింహారావే కోర్టు నోటీసులు ఇస్తే మెజిస్ట్రేట్ ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాడని అన్నారు. కేసీఆర్ ఏమైనా దేవుడా? ఆయన కూడా మనిషే కదా అన్నారు. ఒక్క నోటీసు ఇస్తేనే ఆగమాగం అవుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. నెలల కొద్దీ జైల్లో ఉన్న మా పరిస్థితి ఏంటి మరి అని ప్రశ్నించారు. కాళేశ్వరం కమిషనా, కాంగ్రెస్ కమిషనా అని అడగడం కాదు ముందు కల్వకుంట్ల కవిత అడిగిన ప్రశ్నకు కేసీఆర్ సమాధానం ఇవ్వాలన్నారు.
తనను అక్రమంగా జైలుపాలు చేసినప్పుడు ఈ సోయి ఎందుకు లేకుండా పోయిందని ప్రశ్నించారు. తాను బయటకు వచ్చినప్పుడే చెప్పానని, ఆరోజే శపథం చేశానని గుర్తు చేశారు. జైలు నుంచి వస్తా..ప్రజల మధ్యకు వెళతా, నాకు జరిగిన అన్యాయం గురించి జనానికి తెలియ చేస్తానని అన్నారు. చెప్పినట్టు చేశానని అన్నారు. మళ్లీ వచ్చా. నిఖార్సయిన నాయకుడిగా జనం ముందు నిలబడ్డా. అనుకున్నది సాధించానని చెప్పారు.
ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి సీఎం అవుతానని చెబుతూ వచ్చానని, 10 ఏళ్ల పాటు నిరంకుశ పాలన సాగించిన కేసీఆర్ ను గద్దె దించుతానని ఆనాడే చెప్పానని, చేసి చూపించానని, ఫామ్ హౌస్ కే పరిమితం చేశానని అన్నారు ఎ. రేవంత్ రెడ్డి. ఇక ఆయనకు నిద్ర లేకుండా చేస్తానని అన్నారు. తనను ఇబ్బంది పెట్టిన వారిని ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ తప్పకుండా హాజరు కావాల్సిందేనని అన్నారు. కేసీఆర్ కు ఎలాంటి ఎగ్జంప్షన్ అంటూ ఉండదన్నారు.