కేంద్ర మంత్రిగా ఏం చేశావో చెప్పు
హైదరాబాద్ – తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గద్దర్ గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్ నక్సలైట్ అంటూ పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందుకు బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రం నుంచి ఇద్దరని కేంద్ర మంత్రులను చేస్తే ఉపయోగం ఏముందంటూ ప్రశ్నించారు. గద్దర్ గురించి ఇంకోసారి మాట్లాడితే ఊరుకోమన్నారు.
సోమవారం అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడారు. సోయి ఉండే మాట్లాడుతున్నారా బీజేపీ నేతలంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దర్ ఎక్కడ మీరెక్కడ అంటూ నిలదీశారు. ఒక సామాజిక ప్రయోజనం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ప్రజా యుద్దనౌక గద్దర్ అంటూ పేర్కొన్నారు. ఇంకోసారి చిల్లర మాటలు మాట్లాడితే ప్రజలు ఉరికించడం ఖాయమన్నారు.
వ్యవస్థలను నాశనం చేసి, కేవలం ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా పబ్బం గడుపుకునే మీకు గద్దర్ లాంటి వ్యక్తి నక్సలైట్ గానే కనిపిస్తాడని అన్నారు. ఆయన వల్లనే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి వచ్చిందని గుర్తు పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు అద్దంకి దయాకర్.