వామపక్షాల, హక్కుల సంఘాల సభ ఏకగ్రీవ తీర్మానం
అమరావతి – నక్సల్స్ సమస్యను శాంతి భద్రతల సమస్యగా చూసినంత కాలం మరో వందేళ్లు గడిచినా పరిష్కారం కాదన్నారు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ. దానిని రాజకీయ, ఆర్ధిక, సామాజిక సమస్యగా పరిగణిస్తేనే పరిష్కారం లభిస్తుందన్నారు. ఆదివాసీల పై మారణకాండను ఆపాలని, ఆపరేషన్ కగార్ నిలిపి వేయాలని కేంద్ర సర్కార్ ను డిమాండ్ చేశారు. నక్సల్స్ పేరుతో వేధింపులు పెరిగాయని, ఇది మంచి పద్దతి కాదన్నారు. ప్రజాస్వామిక వాదులు, మేధావులు, కవులు, కళాకారులు దాడులను ఖండించాలని కోరారు.
వామపక్ష పార్టీలు, హక్కుల సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిరసన సభ జరిగింది. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడారు. ఆదాని, అంబానీ వంటి బడా కార్పొరేట్లకు అడవుల్లోని ఖనిజ సంపద అప్పగించే లక్ష్యంతో ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసుల పై, మావోయిస్టుల పై దారుణ మారణకాండకు కేంద్ర ప్రభుత్వం ఒడిగట్టడాన్ని ఆయన ఖండించారు.
రాజ్యాంగం ప్రకారం నడవాల్సిన ప్రభుత్వాలు చట్ట విరుద్ధంగా బుటకపు ఎన్కౌంటర్లకు పాల్పడడం దుర్మార్గమన్నారు. . అందుకే ఎన్ని రాజకీయ విభేదాలు ఉన్నా, కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు పోకడలకు వ్యతిరేకంగా వామపక్షాలే కాకుండా కలసి వచ్చే ప్రజాస్వామిక శక్తులను కలుపుకొని విశాల ఐక్య ఉద్యమాన్ని నిర్మిద్దామని పిలుపు నిచ్చారు.
మాజీ మంత్రి, పార్లమెంటు సభ్యులు సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రిశ్వర్రావు మాట్లాడుతూ ఈ కగార్ మారణకాండకు అదాని, అంబాని వంటి కార్పొరేట్లే ప్రధాన కారకులనీ, వారి అజ్ఞలను మోడీ సర్కార్ అనుసరిస్తున్నదని ఆరోపించారు.
ప్రభుత్వ పరిశ్రమల్ని కార్పొరేట్లకు అప్పగిస్తున్నట్లే, రైతుల్ని, కార్మికులను కార్పొరేట్లకు బానిసలుగా చేయడానికి నల్ల చట్టాల్ని తెస్తున్నట్లే, అడవుల్ని, అటవీ ఖనిజ సంపదను కూడా బడా కార్పొరేట్లకు అప్పగించే లక్ష్యంతోనే “ఆపరేషన్ కగార్” తెచ్చారన్నారు.
ఈ మారణకాండను నిలువరించడానికి విశాల ప్రజాస్వామిక ఉద్యమమే శరణ్యం అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కగార్ దాడులకు వ్యతిరేకంగా విశాల ఐక్య ఉద్యమాల అవసరం చాలా పెరిగిన్నారు.
ఆదివాసులపై సైనిక బలగాల దాడులు ఆపాలని, ఆపరేషన్ కగార్ నిలిపి వేయాలని తీర్మానించిన ఈ సభలోరైతు నాయకులు డాక్టర్ కొల్లా రాజమోహన్ రావు, పాత్రికేయులు డానీ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు D హరినాద్, సిపిఐ ఎంఎల్. న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ఎమ్.సీ.పీ.ఐ. రాష్ట్ర కార్యదర్శి M వెంకటరెడ్డి, ఎం.సి.పి.ఐ.(యు) రాష్ట్ర సహాయ కార్యదర్శి ఖాదర్ భాషా, సిపిఐ ఎం.ఎల్. రెడ్ ప్లాగ్ నాయకులు మరీదు ప్రసాద్, CLC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకా చంద్రశేఖర్, OPDR రాష్ట్ర అధ్యక్షులు హన్మంత రావు, OPDR జాతీయ నాయకులు సి భాస్కర్ రావు, విరసం రాష్ట్ర నాయకులు రివేరా, మానవ హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు రోహిత్, తెలంగాణ నిర్భంద వ్యతిరేక వేదిక నాయకులు రవిచంద్ర తదితరులు ప్రసంగించారు.