డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి – వాలంటీర్ల పేరుతో గత సర్కార్ నిట్ట నిలువునా మోసం చేసిందంటూ ధ్వజమెత్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వాలంటీర్లకు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వేతనాలు పెంచడంపై మొదటి క్యాబినెట్ సమావేశంలోనే చర్చించామన్నారు. అయితే వాలంటీర్లకు సంబంధించి గత ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి జీవోలు ఇవ్వ లేదన్నారు. సరైన ఉత్తర్వు పత్రాలను, జీతభత్యాలను లేకుండానే వారిని నియమించిందని ఆరోపించారు. గౌరవ వేతనాలు విచిత్రంగా ఎక్కడ నుంచి అందించిందో కూడా తెలియని పరిస్థితి కనిపించిందన్నారు. విచారణలో ఎక్కడా అధికారికంగా నియామకాలు జరగలేదని తేలిందన్నారు.
వాలంటీర్ల ఉద్యోగాల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం వారిని నిలువునా వంచించిందని ఆరోపించారు. వాలంటీర్లను సేవ చేయడానికి తీసుకొని గౌరవ వేతనాల పేరుతో అనధికారిక చెల్లింపులు జరిపినట్లు తెలుస్తోందన్నారు. పేరుకు ప్రభుత్వ ఉద్యోగాలు అని నమ్మించి, పూర్తిగా వారు ఏ కోవలోకి చెందకుండా పని చేయించుకున్నారని స్పష్టం చేశారు. అసలు జీతాలు ఎక్కడ నుంచి వచ్చాయో వాలంటీర్లు అంతా సంఘ నాయకులను ప్రశ్నించాలని, విచిత్రమైన అకౌంటింగ్ తో యువతను నిలువునా మోసం చేసిన ఘనత గత ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు.
అల్లూరి సీతా రామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం కురుడి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థులు చెప్పిన సమస్యలు అసాంతం విన్నారు. వాటిని రాసుకున్నారు. అనంతరం సమస్యలపై అధికారులకు తగు సూచనలు చేసి పరిష్కార మార్గాలు వెతకాలని చెప్పారు. ఈ సందర్భంగా కొందరు యువత వాలంటీర్ల సమస్యలను ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాలు అధికంగా ఉన్న జిల్లాల్లో రూ. వెయ్యి కోట్ల ఖర్చుతో రోడ్లను నిర్మిస్తోందన్నారు. ప్రస్తుతం రూ. 400 కోట్లు ఖర్చు చేశాం. మరో రెండు మూడు నెలల్లో రూ. 600 కోట్లు రోడ్ల నిర్మాణం నిమిత్తం ఖర్చు చేయబోతున్నామని ప్రకటించారు.