ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం
కడప జిల్లా – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. మే 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి తెప్పోత్సవాలు జరుగుతాయని తెలిపింది. స్వామి, అమ్మవార్లు ఆలయ పుష్కరిణిలో ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఇందులో భాగంగా మే 10న శ్రీ కృష్ణ సమేత గోదాదేవి మూడు చుట్లు, మే 11న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఐదు చుట్లు, మే 12న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఏడు చుట్లు తెప్పలపై తిరిగి కనువిందు చేయనున్నారని తెలిపింది.
ఈ మూడు రోజుల పాటు ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని టీటీడీ తెలిపింది. ఇదిలా ఉండగా ఒంటిమిట్ట లోని శ్రీ సీతారామ కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించింది. ప్రస్తుతం దేవుని కడప తెప్పోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. ఉత్సవాలను పురస్కరించుకుని పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినట్లు పేర్కొన్నారు.