అదనపు ఈవోకు చెక్ అందజేసిన భక్తుడు
తిరుమల – టిటిడి శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలను టీటీడీ మాజీ చైర్మన్ వ్యక్తిగత కార్యదర్శి కుప్పాల గిరిధర్ కుమార్ విరాళంగా అందజేశారు. తిరుమల క్యాంప్ కార్యాలయంలో టిటిడి అదనపు ఈఓ సి.హెచ్. వెంకయ్య చౌదరిని కుటుంబ సభ్యులతో కలిసి చెక్ ను అందజేశారు. శ్రీవారి ప్రాణదాన ట్రస్ట్ ద్వారా టీటీడీ ఎందరికో విశిష్ట సేవలందిస్తోందని భక్తుడు పేర్కొన్నారు. ఈ సందర్బంగా విరాళాన్ని అందించినందుకు అభినందించారు ఏఈవో వెంకయ్య చౌదరి.
ఇదిలా ఉండగా కలియుగ దైవంగా , కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా తిరుమల పుణ్య క్షేత్రం వెలుగొందుతోంది. కోట్లాది మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని నిత్యం కొలుస్తారు. తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఆయనను తలుచుకుంటే చాలు జీవితం ధన్యమై పోతుందని నమ్ముతారు. ప్రతి రోజూ వేలాది మంది స్వామి దర్శన భాగ్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తారు.
ప్రతి నిత్యం భక్తులు తమకు తోచిన మేరకు కానుకలు, విరాళాలు రూపేణా శ్రీవారి హుండీకి అందజేస్తారు. టీటీడీ ఎన్నో కార్యక్రమాలను చేపడుతోంది. ప్రత్యేకించి లక్షలాది మంది భక్తుల ఆకలిని అన్నదానంతో తీరుస్తోంది. ఇందుకు సంబంధించి ట్రస్టును ఏర్పాటు చేసింది. అన్నదానంతో పాటు విద్య, వైద్యం, వసతి సౌకర్యాల కల్పన, సంస్కృతిని పరిరక్షించేందుకు విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేసింది.