చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా మల్సూర్
నియమించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ముఖ్య పౌర సంబంధాల శాఖ అధికారి (సీపీఆర్ఓ) గా సీనియర్, పదవీ విరమణ పొందిన డాక్టర్ గుర్రం మల్సూర్ ను నియమించింది ప్రభుత్వం. ఆయన వృత్తి రీత్యా పశు వైద్యాధికారిగా పని చేశారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ -1 పరీక్షలు రాశారు. ఆ తర్వాత కన్ ఫర్మ్ డ్ ఐఏఎస్ ఆఫీసర్ గా వివిధ విభాగాలలో పని చేశారు. ప్రధానంగా ప్రపంచ బ్యాంకు ద్వారా ప్రాజెక్టులను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు.
డాక్టర్ గుర్రం మల్సూర్ రాష్ట్ర సహకార శాఖలో డిప్యూటీ రిజిస్ట్రార్గా ప్రభుత్వ సేవలో చేరారు. ఆదిలాబాద్లో ఐటీడీఏ డెవలప్మెంట్ ఆఫీసర్గా, ఎస్సీ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, మహబూబ్నగర్ లో జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి ( సీఈఓ) గా, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా, మైన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో డైరెక్టర్గా, పరిశ్రమల శాఖలో డైరెక్టర్గా, నీటి పారుదల శాఖలో కమిషనర్గా పని చేశారు.
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రిగా రేవంత్ కొలువు తీరిన వెంటనే తనకు అనుంగు అనుచరిగా, కాంగ్రెస్ నాయకుడిగా పని చేసిన , మాజీ జర్నలిస్ట్ బోరెడ్డి అయోధ్య రెడ్డిని ముఖ్య పౌర సంబంధాల అధికారిగా నియమించారు. ఆ తర్వాత ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఎవరూ ఊహించని రీతిలో తనకు కీలకమైన రాష్ట్ర సమాచార కమిషన్ లో ఆర్టీఐ కమిషనర్ గా ఛాన్స్ ఇచ్చారు. దీనిపై బీసీ సంఘాలు పెద్ద ఎత్తున అభ్యంతరం తెలిపాయి.