కేంద్రంతో మాట్లాడానన్న చంద్రబాబు నాయుడు
అమరావతి – పామ్ ఆయిల్ పై సుంకం తగ్గింపు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించే అంశంపై ఇప్పటికే కేంద్రంతో మాట్లాడానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిపై అధికారులు సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మామిడి పంటకు సంబంధించి పంట ప్రణాళికపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పండించిన పంటకు సరైన ధర దక్కాలంటే..ఆ పంటకు మార్కెట్టులో ఎలాంటి డిమాండ్ ఉందనే సమాచారం ఉండాలన్నారు.
బుధవారం సచివాలయంలో సమీక్ష చేపట్టారు నారా చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం మామిడికి ఒక్కో కిలోకు రూ.4 చొప్పున అదనంగా మద్ధతు ధర ఇస్తున్నామని.. ప్రాసెసింగ్ యూనిట్లు రూ.8కి తగ్గకుండా కొనుగోలు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. రైతులకు నష్టం రాకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఏడాదిలో కోకో 12 వేల మెట్రిక్ టన్నుల మేర ఉత్పత్తి వచ్చిందని అధికారులు సీఎంకు వివరించారు.
ఇప్పటికే 10 వేల మెట్రిక్ టన్నుల మేర విక్రయం కూడా జరిగినట్టు తెలిపారు. ప్రతీ రోజూ 80 నుంచి 100 మెట్రిక్ టన్నుల మేర కొనుగోలు చేస్తున్నట్టు వెల్లడించారు. జూలై మొదటి వారానికి మిగిలిన ఉత్పత్తిని కూడా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పండ్లకు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్లను మరిన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అంతర్జాతీయ మార్కెట్ కు అవసరమైనట్టుగా ఎగుమతులు పెంచేందుకు అత్యుత్తమ గ్రేడింగ్ విధానాలను అమలు చేయాల్సిందిగా సీఎం సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ, ఉద్యాన శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్నారు.