అంగరంగ వైభవోపేతంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు
తిరుపతి – కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా ప్రసిద్ది పొందారు తిరుపతి లోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి . స్వామి వారి బ్రహ్మోత్సవాలు శనివారం అంగరంగ వైభవోపేతంగా ప్రారంభం అయ్యాయి. భారీ ఎత్తున భక్తులు హాజరయ్యారు. అంతటా గోవింద నామ స్మరణతో మారుమ్రోగింది.
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పెద్ద ఎత్తున టిటిడి పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు భక్తులకు అన్నదానం, ఆకర్షణీయంగా విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు, క్షేత్ర మహిమను తెలిపేలా ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేశారు. ఎస్వీ మ్యూజిక్ కళాశాల, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో స్వామివారి ఆలయ ప్రాంగణంలో ధార్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
అంతకు ముందు ఉదయం 9.30 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేపట్టారు సాయంత్రం 5.30 నుండి రాత్రి 6.30 గంటల వరకు ఊంజల్సేవ ఘనంగా నిర్వహించారు.