మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి
మాజీ సీఎం జగన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యం చెందిందంటూ ఆరోపించారు. ప్రధానంగా బహుజనులు, దళితులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందన్నారు.
ఏపీలో కూటమి సర్కార్ కొలువు తీరాక కక్ష సాధింపు ధోరణి కొనసాగుతోందన్నారు. పనిగట్టుకుని అక్రమ కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. అధికారపార్టీ నాయకుల డైరెక్షన్లో కక్షసాధింపు చర్యల్లో మునిగి తేలుతున్న పోలీసు యంత్రాంగం పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించడంవల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట దళితులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయని వాపోయారు. పోలీస్స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోవడమే కాదు, ఫిర్యాదు దారులమీదే ఎదురు కేసులు పెట్టడం పరిపాటిగా మారిందన్నారు.. జేమ్స్పై దాడి ఘటనలో పోలీసు యంత్రాంగం వైఫల్యమే కాదు, రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదును కూడా స్వీకరించలేని పరిస్థితి నెలకొందన్నారు. తిరుపతి ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.