స్పష్టం చేసిన మాజీ మంత్రి కేటీఆర్
చెన్నై – మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో జరిగిన డీలిమిటేషన్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా సమాఖ్య వాదం అనేది బహుమతి కాదని అది మనందరి హక్కు అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కావాలని దక్షిణాది రాష్ట్రాలపై కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఇప్పటికే ఇండియాలో ఉత్తర భారతం, దక్షిణ భారతం అనే భావన నెలకొన్నదని వాపోయారు.
ఇది అత్యంత ప్రమాదకరమైన అంశం అని పేర్కొన్నారు కేటీఆర్. భారత దేశం అనేది రాష్ట్రాలతో కూడుకుని ఉన్న యూనియన్ అన్నారు. తెలంగాణ భారతదేశ జనాభాలో 2.8 శాతంగా ఉందన్నారు. కానీ జీడీపీ పరంగా 5.2 శాతం చెల్లిస్తున్నామని చెప్పారు . ఒక రకంగా చెప్పాలంటే మనం అక్షరాలా మన బరువును రెండింతలు మోస్తున్నామనన్నారు. పార్లమెంట్ సాక్షిగా మన గొంతు మనం విప్పలేని స్థితిలోకి వెళ్లి పోయామన్నారు. న్యాయాన్ని అపహాస్యం చేయడం తప్పితే మరోటి కాదన్నారు.
ఏదైనా నిజమైన సమాఖ్య ప్రభుత్వం అధిక పనితీరు కనబరిచిన రాష్ట్రాలను ప్రోత్సహిస్తుందన్నారు, అయితే నేడు భారతదేశంలో వెనుకబడిన వారికి బహుమతులు ఇచ్చే, సాధించిన వారికి జరిమానా విధించే విధానం ఉండటం బాధాకరమని అన్నారు కేటీఆర్. ఇది కేవలం అసమతుల్యత కాదని, దీని వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు.