నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ – తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుట్రలకు తెర లేపాడని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ఆనాడు పోరాటాలు, ఆందోళనలు చేపట్టామన్నారు. కోరి తెచ్చుకున్న తెలంగాణలో ప్రధానమైన వనరులను అప్పనంగా కొట్టేసేందుకు కేంద్రాన్ని అడ్డం పెట్టుకుని చక్రం తిప్పుతున్నాడంటూ ధ్వజమెత్తారు.
చంద్రబాబు ఆటలు ఏపీలో సాగుతాయోమో కానీ తెలంగాణలో వర్కవుట్ కాదన్నారు. ఆయనకు స్వతహాగా ఇక్కడి ప్రజల గురించి బాగా తెలుసన్నారు. తెలుగు వారి పేరుతో రాజకీయాలు చేసేందుకు ఇది సమయం కాదన్నారు. తన పని తాను చేసుకుంటూ మంచిదని హితవు పలికారు హరీశ్ రావు. గోదావరి, కృష్ణా జలాల గురించి బేసిక్స్ కూడా తెలుసు కోకుండా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన వల్ల తెలంగాణకు నష్టం తప్ప ఒరిగింది ఏమీ లేదన్నారు.
గోదావరి కృష్ణా జలాలు మీ అయ్య సొమ్మా అని రేవంత్ పై నిప్పులు చెరిగారు. 1000 టీఎంసీల నీళ్లను ఏపీకి రాసిస్తానంటూ ఊరుకుంటారని అనుకోవడం భ్రమ అని అన్నారు. రాష్ట్ర హక్కులను చంద్రబాబుకు ఇచ్చేందుకు నువ్వు ఎవడివంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఆయనకు అడుగులకు మడుగులు ఒత్తుతున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. తప్పుడు సమాచారం ఇస్తే జైల్లో వేస్తామని ఆనాడు కోర్టు హెచ్చరించిన వ్యక్తి ఇప్పుడు రేవంత్ రెడ్డికి సలహాదారుడుగా ఉండడం దారుణమన్నారు.
ఈరోజు చంద్రబాబు అనే భగవంతుడికి రేవంత్ అనే భక్తుడికి మధ్య ఉన్న అంబికా దర్బార్ బత్తి ఈ ఆదిత్యనాథ్ అని హరీశ్రావు పేర్కొన్నారు.