రాజకీయ కక్ష సాధింపు చర్యలు
హైదరాబాద్ – మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ సర్కార్ కావాలని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. కావాలని కేటీఆర్ ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఫార్ములా-ఈ కేసులో విచారణ కోసం మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు నోటీసులు ఇవ్వడాన్ని తప్పు పట్టారు. పాలనా పరంగా ప్రజా సమస్యలను పరిష్కరించ లేక ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం దారుణమన్నారు.
హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ రెడ్డి దర్యాప్తు సంస్థలను యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు నిదర్శనం కేసీఆర్ కు , కేటీఆర్ కు, తనకు నోటీసులు ఇవ్వడమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలని నిరంతరం ప్రశ్నిస్తున్న కేటీఆర్ నైతిక స్థయిర్యాన్ని దెబ్బ తీసేందుకే ఈ నోటీసులు కావాలని సీఎం పంపించారంటూ మండిపడ్డారు.
ఈ ప్రభుత్వం 18 నెలల పాలనలో డైవర్షన్ పాలిటిక్స్ను అమలు చేస్తూ బీఆర్ఎస్ను బద్నామ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రాజకీయ అరాచకత్వం గెలిచే ప్రసక్తే లేదన్నారు. రేవంత్ రెడ్డి డ్రామా, డైవర్షన్ రాజకీయాలు ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యాయని పేర్కొన్నారు.
ఫార్ములా-ఈ రేసింగ్తో తెలంగాణ ప్రతిష్ట పెరిగిందే తప్పా తగ్గలేదన్నారు. భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు కూడా వచ్చాయని తెలిపారు. తెలంగాణ ప్రతిష్ట పెంచినందుకా కేటీఆర్పై మీ నోటిసుల ప్రతాపం అంటూ ప్రశ్నించారు. ఎలక్ట్రిక్ వాహనాల మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తెలంగాణను మార్చేందుకు ఫార్ములా-ఈ రేస్ను హైదరాబాద్లో నిర్వహించడం జరిగందన్నారు హరీశ్ రావు.