మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్
హైదరాబాద్ – రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో వివక్ష చూపిస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఉద్యోగులకు కేసీఆర్ 73 శాతం పీఆర్సీ ఇచారని , ఇది దేశంలోనే అత్యధికం అని గుర్తు చేశారు. మీరెందుకు ఇవ్వలేదంటూ నిలదీశారు. మెరుగైన పీఆర్సీ ఇస్తామంటూ ఉద్యోగులకు ఇచ్చిన మాటను తప్పారంటూ ఆరోపించారు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చారే తప్పా ఇప్పటి వరకు తీపి కబరు చెప్పలేదన్నారు. పీఆర్సీ పెంపు కోసం మూడు కమిటీలు వేయడం విడ్డూరంగా ఉందన్నారు.
పోనీ ఈ కమిటీలు ఏం చేశాయో ఇప్పటి వరకు చెప్పిన పాపాన పోలేదన్నారు హరీశ్ రావు. తక్షణమే మూడు డీఏలు చెల్లించాలని ఉద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీం తీసుకు రావాలని అన్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన దాని కంటే ఎక్కువ పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇదే సమయంలో బీజేపీపై కూడా భగ్గుమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు బీజేపీకి పట్టవా అని నిలదీశారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే బిజేపీ పెదవి విప్పడం లేదన్నారు.
గోదావరి బనకచర్ల మీద బిజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. బనకచర్ల ద్వారా తెలంగాణ గోదావరిలో వాటా కోల్పోయే పరిస్థితి ఉందన్నారు హరీశ్ రావు. శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ లైనింగ్ పూర్తి అయితే రోజుకు 90 వేల క్యూసెక్కుల చొప్పున తరలిస్తారని ఆరోపించారు.
బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కండ్లు తెరవాలన్నారు. ఏపీ నీటి దోపిడిని అడ్డుకోవాల్సిన కేఆర్ఎంబీ.. చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుతున్నదంటూ ధ్వజమెత్తారు తన్నీరు హరీశ్ రావు.