మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవం కోసం బెదిరింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు అదే పనిలో బిజీగా ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. వాళ్లను అడ్డుకునే సత్తా ఒక్క బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు కేటీఆర్. ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు.
అర చేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకుని ప్రజలు కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు కేటీఆర్. కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోయేసరికి ఎంతో నష్టపోయామన్న భావనలో ప్రజలు ఉన్నారన్నారు.
మంగళవారం హైదరాబాద్ లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసంలో ఖమ్మం జిల్లా పార్టీ నేతలతో సమావేశం జరిగింది. బర్త్ డే ఫంక్షన్ లకు పోవడానికి హెలికాప్టర్ లను ఉపయోగిస్తున్న మంత్రులు ఖమ్మం వరదలప్పుడు మాత్రం హెలికాప్టర్ లు పంపలేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతకానితనానికి ఓ కుటుంబం వరదల్లో కొట్టుకు పోయిందని ఆరోపించారు.
2014 తర్వాత ఖమ్మంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అసాధారణ అభివృద్ధి చేసిందన్నారు. కానీ యువ నాయకుడు అజయ్ ఓడి పోవడం బాధాకరమన్నారు. ఓడి పోయినా ప్రజలకు గులాబీ దండు అండగా ఉందన్నారు. డిప్యూటీ సీఎంతో కలిపి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. కానీ వరదల సమయంలో వాళ్లతో పైసా ఉపయోగ పడలేదన్నారు.