కాంగ్రెస్ ప్రభుత్వంపై భగ్గుమన్న మాజీ మంత్రి
మాజీ మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. త్వరలోనే తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. సోమవారం ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. ఇది మూడోసారి. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పాలన చేతకాక తమను ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ ఫైర్ అయ్యారు. అయినా తమకు అరెస్ట్ లు, కేసులు కొత్త కాదన్నారు. ఎవరికీ భయపడే ప్రసక్తి లేదన్నారు. 420 హామీలు, ఆరు గ్యారెంటీలపై నిలదీస్తూనే ఉంటామని వార్నింగ్ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ విచారణలు, కమిషన్ల వలన, రాజకీయ వేధింపుల వలన వెనక్కి తగ్గేదే లేదన్నారు కేటీఆర్ . సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారెంటీల అమలు మోసాన్ని ఎండబెట్టడంలో ఇవేవీ మమ్మల్ని ఆపలేవన్నారు. ఎన్ని కుట్రలు చేసినా హామీలతో, డిక్లరేషన్ల పేరుతో ప్రజలకు చేసిన దగాను ఎండగడుతూనే ఉంటామన్నారు.
ఎన్ని కుట్రలైనా చేసుకో అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటెంట్ కేటీఆర్. ఇదే సమయంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుకున్నారని, కానీ ఆచరణలో కేసీఆర్ సారథ్యంలో చేసి చూపించారని గుర్తు చేశారు. ఉద్యమంతో సంబంధం లేని వాళ్లు పాలన సాగిస్తే ఇలాగే ఉంటుందన్నారు. ఇవాళ ఏ వర్గం సంతృప్తికరంగా లేదన్నారు. మోసం తప్పా చేసింది ఏముందంటూ ప్రశ్నించారు కేటీఆర్. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు.