హరీశ్ రావు అద్భుతంగా పని చేశారు
హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో కొత్తగా కోటి ఎకరాల మాగాణం సృష్టించ బడటానికి ప్రధాన కారణం హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా పనిచేసి మిషన్ కాకతీయ, కాళేశ్వరాన్ని శరవేగంగా పూర్తి చేశారన్నారు. గుజరాత్లో ఒక పెద్ద బ్రిడ్జి కూలి పోయి 140 మంది చనిపోతే ఏ NDSA వెళ్ల లేదన్నారు. బీహార్లో నాలుగు రోజులకి ఒక బ్రిడ్జి కూలిపోతున్నా అడిగే నాధుడు లేడంటూ ధ్వజమెత్తారు. అదే తెలంగాణలో సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి 100 కోట్లు నష్టం జరిగితే ఎందుకు రాలేదంటూ ప్రశ్నించారు.
అలానే SLBC టన్నెల్ కుప్పకూలిపోయి 8 మంది చనిపోయినా.. ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కేంద్రంలో ఉండే ఒక్క మంత్రి ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం దారుణమన్నారు కేటీఆర్. వట్టెం పంప్ హౌస్ మునిగిపోతే దాని గురించి మాట్లాడే వాళ్ళు లేరన్నారు. అలానే పెద్ద వాగు ప్రాజెక్ట్ రెండు సార్లు కొట్టుకు పోయినా అడిగేవాడు లేకుండా పోయాడన్నారు.
కానీ కాళేశ్వరంలో 100 కాంపోనెంట్లు ఉంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లలో ఒక దగ్గర పగుళ్లు వస్తే దాన్ని పట్టుకొని ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చిందని ఆరోపించారు. ఈ నివేదిక బీజేపీ ఆఫీసులో తయారు చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్.