మాజీ మంత్రికి ఆత్మీయ పలకరింపు
అమరావతి – తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి ఎపి సిఎం చంద్రబాబును అసెంబ్లీలో కలిశారు. చాలా కాలం తరువాత తనను కలిసిన నాగంను ఆప్యాయంగా పలకరించారు. నాగం ఆరోగ్యం ఎలా ఉంది అంఊ ఆరా తీశారు. చాలా రోజులు అయ్యింది కలిసి అంటూ పలకరించారు. పిల్లలు ఏం చేస్తున్నారు అని వాకబు చేశారు. నాగం కుటుంబ యోగ క్షేమాలు తెలుసుకున్న చంద్రబాబు…ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు.
ఓబులాపురం మైనింగ్ అంశంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు చేసిన ఉద్యమాలపై నాడు కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల విచారణలో భాగంగా విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టుకు నాగం జనార్థన్ రెడ్డి గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా జనార్థన్ రెడ్డి అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. ఆనాటి కేసులను ఎట్టకేలకు కొట్టి వేయడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
భేటీ సందర్భంగా ఇరువురు నేతలు పలు పాత ఘటనలను గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాడు చేసిన ప్రజా పోరాటాలను గురించి చర్చించుకున్నారు. నాగం ఫైర్ బ్రాండ్గా ఉండే వారని….పార్టీ ఆదేశిస్తే దూసుకు పోయే వారంటూ ఈ సందర్భంగా సీఎం అన్నారు. ఎంతో ఎమోషన్గా ఉండే వారంటూ నాటి ఘటనలను ప్రస్తావించారు. నాలుగవసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబును చూడడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని నాగం ఈ వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి…తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో విజయాలు సాధించాలనేదే తన అభిమతమని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.