మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ – రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సాగిస్తున్న పాలన గాడి తప్పిందన్నారు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. ఆచరణకు నోచుకోని హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందారని అన్నారు. పాలన గురించి పట్టించుకోకుండా కేవలం కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని ధ్వజమెత్తారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ప్రతిపక్షం ఏదైనా చెబితే పాలకపక్షం సూచన అనుకుని తమ లోపాలు సమీక్షించు కోవాలన్నారు. అయితే సర్కార్ ప్రతిపక్షాన్ని వేధించడానికి పూర్తి సమయం వెచ్చిస్తోందంటూ మండిపడ్డారు.
సోమవారం వి. శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబాన్ని వేధించడానికి పాలనను పూర్తిగా పక్కన బెడుతున్నారని ఆరోపించారు. నయవంచన, అబద్ధాలకు కాంగ్రెస్ కేరాఫ్ అడ్రస్ గా మారిందన్నారు. ఫార్ములా ఈ కార్ల రేసింగ్ లో ఎలాంటి అవినీతి జరగకున్నా కేటీఆర్ ను విచారణకు పిలిచారని ఆరోపించారు. ఈ కేసులో అవినీతి సొమ్ము ఎవరికీ ముట్ట లేదన్నారు. పారదర్శకంగా డబ్బు బదిలీ ప్రక్రియ జరిగిందని చెప్పారు మాజీ మంత్రి.
అందాల పోటీలు జరిగాయి ,ఫార్ములా వన్ జరిగింది. ఏ పోటీలు ఎలా జరిగాయో లోకం చూసిందన్నారు. అందాల పోటీలు అట్టర్ ప్లాప్ అయ్యాయని పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేసింగ్ తో అమరరాజా బ్యాటరీ సంస్థ తో పాటు ఏడెనిమిది కంపెనీలు పెట్టుబడులు వచ్చాయన్నారు వి. శ్రీనివాస్ గౌడ్. 26 పెద్ద పేరున్న కార్ల తయారీ సంస్థలు ఈ ఈవెంట్ లో పాల్గొన్నాయని చెప్పారు.
ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరగడానికి ఈ రేసింగ్ తోడ్పడిందన్నారు. పెట్టుబడులు తెచ్చిన కేటీఆర్ పై కేసు పెడతారా ? అందాల పోటీల్లో అసభ్యంగా ప్రవర్తించిన వారి పై కేసులు పెట్టరా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రతిష్ట దెబ్బతీయడం తప్ప అందాల పోటీలతో ఏమైనా ఒరిగిందా అని నిలదీశారు వి. శ్రీనివాస్ గౌడ్.