మాజీ ఎమ్మెల్యే ఎ. జీవన్ రెడ్డి
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఎ. జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను ఓ గురువింద గింజతో పోల్చారు. దొంగే దొంగ అని అరిచినట్టుంది రేవంత్ తీరు అంటూ ఎద్దేవా చేశారు. హామీలు అమలు చేయకుండా తాత్సారం చేయడంపైనే ఫోకస్ పెట్టారన్నారు.
తెలంగాణ జాతిపిత కేసీఆర్ ను విచారణల పేరిట వేధిస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ అంటే ట్రిపుల్ ఆర్ స్కీమ్స్ అని కానీ రేవంత్ రెడ్డి అంటే ట్రిపుల్ ఆర్ స్కామ్స్ అని ఆరోపించారు జీవన్ రెడ్డి.
కేటీఆర్ మీద కేసు పెట్టడం సిగ్గు చేటు అన్నారు. అసలు ఏఐసీసీ అంటేనే ఆల్ ఇండియా కరప్షన్ సెంటర్ అని ఫైర్ అయ్యారు. పీసీసీ అంటే ప్రదేశ్ కరప్షన్ సెంటర్ అని అన్నారు. మూడు రంగాల జెండాను పెట్టుకుని అవినీతి దందాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జాతీయ పతాకాన్ని అప్రదిష్ట పాలు చేస్తున్న కాంగ్రెస్ తన జెండా ను మార్చుకోవాలని హితవు పలికారు. రేవంత్ ముఖ్య సలహాదారులంతా అక్రమార్జనలో ఆరి తేరి పోయారంటూ ఎద్దేవా చేశారు జీవన్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీ కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఓ బిల్డర్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకు కోర్టులో పిల్ వేశారని ఆరోపించారు. స్కాం ల ద్వారా వసూలు చేసిన డబ్బులు రాహుల్ గాంధీకి వెళ్తోందన్నారు.
రేవంత్ అనుచరుడు ఫహీం ఖురేషి మరో నయీమ్ గా మారారంటూ మండిపడ్డారు. లియోనియా రిసార్ట్ లో ఫహీమ్ ఖురేషి పది వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. శామీర్ పేట లోని లియోనియా రిసార్ట్ 180 ఎకరాల్లో ఉందన్నారు. ఈ రిసార్ట్ రూ. 2200 కోట్లు బ్యాంకులకు బకాయి పడిందన్నారు.
టెండర్లలో ఎవ్వరూ పాల్గొనకుండా ఫహీమ్ ఖురేషి ఒత్తిడి తెచ్చి రంజిత్ రెడ్డికి లియోనియా దక్కేలా చేశారన్నారు. ఇందులో బీజేపీ ఎంపీలకు కూడా వాటా ఉందన్నారు. అందుకే దీనిపై వారు నోరు విప్పడం లేదన్నారు. కేంద్ర నిఘా సంస్థలు ఈ వ్యవహారం లో వెంటనే రంగం లోకి దిగాలన్నారు.