టీజీ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్
మోడీ సర్కార్ తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపిస్తోందని అన్నారు ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోక తప్పదన్నారు. దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. సవతి తల్లి ప్రేమ చూపించడం మానుకోవాలని అన్నారు. కేంద్రం నిధులు ఇవ్వదు..విభజన హామీలు అమలు చేయదని ఆరోపించారు.
తాము ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ఆనాడు రూ. 15 వేల కోట్లు మిగులు బడ్జెట్ ఇచ్చిందని , కానీ బీఆర్ఎస్ ఏడున్నర లక్షల కోట్ల అప్పులు మిగిల్చిందంటూ మండిపడ్డారు. జి. చిన్నారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ అంశాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎందుకు చెప్పలేక పోయారని ప్రశ్నించారు.
పార్లమెంట్లో బిల్లు పాస్ అయి రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిసారి అక్కసును వెళ్ళగక్కుతూనే ఉన్నారని చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అక్కసును మనసులో పెట్టుకుని ప్రధాని తెలంగాణపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ పార్లమెంటులో బిల్లు పెట్టినపుడు బీజేపీ కూడా మద్దతు ఇచ్చిందన్న విషయం ప్రధాని గుర్తు పెట్టుకోవాలని చిన్నారెడ్డి పేర్కొన్నారు.