2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు
అమరావతి – గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. వచ్చే 2027 సంవత్సరం జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలు పెట్టింది. ఈసారి పుష్కరాల కోసం ఏకంగా 8 కోట్ల మందికి పైగా వస్తారని అంచనా వేస్తోంది. 2015లో ఇదే గోదావరి పుష్కరాల ప్రారంభోత్సవం సందర్బంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ప్రాణ నష్టం సంభవించింది. ముందు జాగ్రత్తగా ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టింది.
అలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు గాను చర్యలు చేపట్టాలని ఆదేశించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఒకే ఘాట్లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు.
గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి అధికార యంత్రాంగం రూ.904 కోట్లతో ప్రతిపాదలు సిద్దం చేసింది. కేంద్రం ముందస్తుగానే గోదావరి పుష్కరాల కోసం ఇప్పటికే రూ. 100 కోట్ల నిధులు కేటాయించింది.
తాజాగా రైల్వే శాఖ పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యాల కల్పన కోసం రాజమండ్రి రైల్వే స్టేషన్ కు రూ 271.43 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రధాన ప్రాంతాల నుంచి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లు నడుపుతామని.. ముందస్తుగానే వాటి వివరాలు వెల్లడిస్తామని తెలిపింది.
అఖండ గోదావరి పుష్కరాలు-2027 ముసాయిదా యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లకు రోజుకు 75,11,616 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్, టూరిజం, దేవాదాయ శాఖల అధికారులు సంయుక్తంగా పుష్కర ఏర్పాట్ల పైన సమీక్ష చేశారు. యాత్రికుల బస ఏర్పాట్లతోపాటు మరో నాలుగు కొత్త ఘాట్లు అవసరమని భావిస్తున్నారు.
రాజమహేంద్రవరం పరిధిలో గోదావరి ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించారు. కార్పొరేషన్ పరిధిలో రోడ్ల అభివృద్ధికి రూ.456.5 కోట్లు, ఆర్అండ్బీ రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి రూ.678.76 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. మొత్తంగా పుష్కర ఘాట్ల కోసం కావాల్సిన నిధుల పైన అధికార యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు.