ఘణంగా కోదండరాముడి బ్రహ్మోత్సవాలు
తిరుపతి – ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈనెల 11న రాములోరి కళ్యాణోత్సవం జరగనుంది. వేలాది మంది భక్తులు హాజరవుతున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు దంపతులు. ఈవో ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇక ఉత్సవాలలో భాగంగా విశేషమైన హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది.
శ్రీ సీతా రామ లక్ష్మణులు ప్రియభక్తుడైన హనుమంత వాహనాన్ని అధిరోహించి పుర వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి దర్శించుకున్నారు.
త్రేతా యుగంలో రామ భక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వారు హనుమంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం ద్వారా తెలుస్తోంది. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నారు. దాసభక్తికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతున్నారు.
వాహన సేవలో డెప్యూటీ ఈఓ నటేష్ బాబు, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.