ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
అమరావతి – ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాయలసీమలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఉష్ణోగ్రతలు 38°C-40°C మధ్య నమోదయ్యేందుకు అవకాశం ఉందన్నారు.
గంటకు 50-60 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదన్నారు.పిడుగులతో కూడిన భారీ వర్షాలు నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రానున్న మూడు రోజులు వాతావరణం క్రింది విధంగా ఉండనునట్లు రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు
తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
మే 21న బుధవారం అనంతపురం, అన్నమయ్య, శ్రీసత్యసాయి, చిత్తూరు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ,కోనసీమ, కృష్ణా, గుంటూరు ,పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
22న గురువారం రోజు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు రోణంకి కూర్మనాథ్.