స్పష్టం చేసిన మంత్రి వంగలపూడి అనిత
అమరావతి – మే2న ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్నారు. అమరావతి రాజధాని పునర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్బంగా ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి వంగలపూడి అనిత. భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పీఎం రాక కోసం ఏపీ ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారని అన్నారు. అమరావతి నిర్మాణం కోట్లాది జనం కల.. కానీ ఐదేళ్ల క్రితం విధ్వంస పాలన మొదలైందంటూ మండిపడ్డారు. ప్రజా వేదిక కూల్చడంతోనే అమరావతి విధ్వంసానికి బీజం పడిందన్నారు. ముఖ్యమంత్రులు ఎవరైనా గత పాలకులు చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించారని తెలిపారు.
కానీ వై ఎస్ జగన్ మాత్రం మూడు రాజధానుల పేరుతో కొత్త కథకు తెర లేపారని విమర్శించారు మంత్రి. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. ప్రజలు మాత్రం అమరావతి రాజధాని కోసం పోరాడారని, విశాఖ ప్రజలు సైతం రాజధానిగా అమరావతినే కోరుకున్నారని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని కోసం ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసిన రైతులను జగన్ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని చూసేందుకు చంద్రబాబు బస్సు యాత్ర చేస్తే రాళ్ల దాడి చేశారని, అదేంటని అడిగితే పోలీసుల చేత భావప్రకటన స్వేచ్ఛ అని చెప్పించారని అన్నారు. అమరావతి పున: నిర్మాణ పనుల ప్రారంభం వెనుక ఎంతోమంది కష్టం ఉందన్నారు.
మహిళా రైతులు పోలీసులతో బూట్ల దెబ్బలు తిన్నారు, రోడ్ల మీద భోజనాలు చేశారని చెప్పారు వంగలపూడి అనిత. తిరుపతి పాదయాత్ర చేపడితే జగన్ ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు కల్పించిందన్నారు. కొంతమంది రైతులపై 120, 130 కేసులు కూడా పెట్టారని వాపోయారు. రాజధాని లేని రాష్ట్రంగా ఐదేళ్లు నాశనం చేశారని ధ్వజమెత్తారు జగన్ రెడ్డిని ఉద్దేశించి. కానీ ఇప్పుడు మా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునేలా చేస్తున్నామన్నారు వంగలపూడి అనిత.