గండిపేటకు తప్పిన మురుగు ముప్పు
హైదరాబాద్ – జంట నగరాలకు తాగు నీరు అందించే గండిపేట( ఉస్మాన్సాగర్)కు మురుగు ముప్పు తప్పింది. ఖానాపూర్, నాగులపల్లి నుంచి వచ్చిన మురుగు నీరు బుల్కాపూర్ నాలా ద్వరా గండిపేటలోకి వెళ్లకుండా హైడ్రా చర్యలు తీసుకుంది. రూ. 2 లక్షలు వెచ్చించి బుల్కాపూర్ నాలాకు కొత్త షట్టర్లను ఏర్పాటు చేసింది. వరద వచ్చేటప్పడు గండిపేటకు చేరేలా కాలువకు ఉన్న షట్టర్లు (గేట్లు) శిథిలమైన విషయం విధితమే.
మురుగు నీరు గండిపేటలో కలుస్తున్నదని మీడియాలో వచ్చిన కథనాలపై హైడ్రా స్పందించింది. అధికారుల బృందంతో కలసి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వెంటనే షట్టర్ల మరమ్మతులను చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. శిథిలమైన షట్టర్ల స్థానంలో కొత్తవి అమర్చడంతో మురుగు నీరు గండిపేట చెరువులోకి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే బుల్కాపూర్ నాలాలో పూడికపోయిన చెత్తను కూడా కొంతమేర తొలగించి మురుగు నీరు ముందుకు సాగేలా ఏర్పాట్లు చేశారు.
ఒకప్పడు వరద కాలువగా ఉన్న బుల్కాపూర్ నాలాలో పైన ఉన్న నివాసాలు, వాణిజ్య సముదాయాలు , రిసార్టుల నుంచి మురుగు నీరు ప్రవహిస్తోంది. శంకరపల్లి లోని బుల్కాపూర్ చెరువు నుంచి ఖానాపూర్, కోకాపేట, నార్సింగ్, పుప్పాలగూడ, మణికొండ, దర్గా, షేకేపేట్, టోలి చౌకి , పోచమ్మ బస్తీ, చింతలబస్తీ మీదుగా హుస్సేన్ సాగర్కు వర్షపు నీరును తీసుకెళ్లే చరిత్ర ఈ నాలాది. బుల్కాపూర్ నాలాను పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయని.. హుస్సేన్ సాగర్కు వర్షపు నీటిని తీసుకువచ్చే ఏకైక నాలాగా దీనికి ప్రత్యేక స్థానం ఉందని స్థానికులు గుర్తు చేశారు. ఇప్పుడీ నాలా పునరుద్ధరణపై హైడ్రా దృష్టి పెట్టింది.