స్పష్టం చేసిన చంద్రబాబు నాయుడు
అమరావతి – కచ్చితమైన ప్రణాళికలతో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం లెక్కల్లో జాతీయ స్థాయికి మించి ఏపీ పురోగతిని సాధించిందని అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జాతీయ స్థాయిలో తలసరి ఆదాయం 8.7 శాతం మేర పెరిగితే.. ఏపీ 11.89 శాతం మేర పురోగతి నమోదు చేసిందని అధికారులు వెల్లడించారు.
రాష్ట్రం ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు అవసరమైన డేటా అనలిటిక్స్ కోసం టెక్నాలజీని వినియోగించు కోవాలన్నారు. ఆర్థికాభివృద్ధికి అనువుగా ఉన్న రంగాలపై దృష్టి పెట్టడంతో పాటు..సేవల రంగం అభివృద్ధి జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తే ఆర్థిక సుస్థిరతను త్వరితగతిన సాధించగలమని ముఖ్యమంత్రి వివరించారు.
రాష్ట్ర, జిల్లా, మండలాలతో పాటు గ్రామ స్థాయిలో కూడా కీ-పెర్ఫామెన్స్ ఇండికేటర్లు పెడితే.. క్షేత్ర స్థాయి నుంచి పోటీతత్వం పెరుగుతుందన్నారు. 2028-29 నాటికి 15 శాతం వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
నెలవారీ అభివృద్ధి సూచికల ద్వారా ఎప్పటికప్పుడు పనితీరును సమీక్షించుకునే అవకాశం ఉంటుందని సీఎం సూచించారు. దీని వల్ల ఎప్పుడైనా లోటుపాట్లు ఉంటే తక్షణం సవరించుకునే అవకాశం ఉంటుందన్నారు. సాంకేతికతను జోడించి నీటి యాజమాన్యాన్ని కూడా సమర్ధంగా నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు.
సరైన నీటి యాజమాన్యం చేపడితే కరవు పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు ఉండాలన్నారు. రిజర్వాయర్లు, నేలలో తేమ శాతం, భూగర్బ జలాల వివరాలు వంటివి నమోదు చేసి వివరాలు తీసుకునే బాధ్యతను ప్రణాళిక శాఖ తీసుకోవాలన్నారు. వ్యవసాయం, ఉద్యాన పంటల్లో గ్రాస్ వాల్యూ ఎడిషన్ తో పాటు సేవల రంగంలో పెట్టుబడులు పెరిగేలా కార్యాచరణ రూపొందించు కోవాలన్నారు.
విద్యుత్ కొనుగోలు ధరలు తగ్గించేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయనే అంశాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు. పి-4లో బంగారు కుటుంబాలు-మార్గదర్శుల మధ్య సమన్వయం చేసుకునే ప్రక్రియను ఆగస్టు 15వ తేదీలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.