ఆఫీసుకు తీసుకు వెళ్లిన అధికారులు
హైదరాబాద్ – ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి తెలుగు సినీ ఇండస్ట్రీని. ఎవరిపై ఎప్పుడు పడతారో తెలియక తంటాలు పడుతున్నారు. గత నాలుగు రోజులుగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసాలు, ఆఫీసుల్లో సోదాలు చేపట్టారు. దిల్ రాజు, భార్య తేజస్విని, సోదరుడు శిరీష్, కూతురు స్నేహితా రెడ్డితో పాటు బంధువుల ఇళ్లల్లో కూడా తనిఖీలు చేపట్టారు.
విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సాగర్ సొసైటీలో ఉన్న శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి దిల్ రాజును తీసుకు వెళ్లారు. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. తేజస్వినికి చెందిన బ్యాంకు ఖాతాలు , లాకర్స్ ను కూడా తనిఖీ చేశారు. సినిమాల నిర్మాణానికి సంబంధించిన లావాదేవీల వ్యవహారాల గురించి కూడా ఐటీ ఆఫీసర్స్ ఆరా తీశారు.
ఇదిలా ఉండగా తాజాగా సంక్రాంతికి పండుగ సందర్భంగా దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో రెండు బిగ్ సినిమాలను రిలీజ్ చేశారు. ఒకటి రామ్ చరణ్ తో తీసిన గేమ్ ఛేంజర్, రెండోది వెంకీ తో తీసిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ. ఈ రెండింటిలో ఒకటి అట్టర్ ప్లాప్ కాగా సంక్రాంతికి వస్తున్నాం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఏకంగా 10 రోజుల్లో రూ. 230 కోట్లకు పైగా వసూలు చేసింది.