పొంగులేటిపై భగ్గుమన్న బీసీ సంఘాలు
హైదరాబాద్ – బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని స్పష్టం చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. రిజర్వేషన్లు అమలు చేయకుండా జూన్ చివరి వారంలో స్థానిక ఎన్నికల నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి చెప్పడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామనడానికి పొంగులేటి ఎవరు ? ఏ హోదాతో పొంగులేటి ఎన్నికలకు వెళ్తామని అన్నారో వివరణ ఇవ్వాలని అన్నారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లుపై తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్షంతో ఢిల్లీకి వెల్లి ప్రధానిని కలవాలని స్పష్టం చేశారు జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం బీసీ మేధావులు, అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాలతో చర్చించిన తర్వాతనే ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్తానంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడుతామని వార్నింగ్ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయక పోతే ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని కలుస్తామన్నారు.
బీసీ రిజర్వేషన్లపై సీఎం, పీసీసీ చీఫ్ అనుకూలంగా ఉన్నప్పటికి కొంతమంది మంత్రులు, అధికారులు వారిని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు జాజుల శ్రీనివాస్ గౌడ్. హైదరాబాదులో బీసీ సంఘాలు, మేధావులు, కుల సంఘాలతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి భవిష్యత్ ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. సచివాలయం మీడియా పాయింట్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, బీసీ మేధావుల ఫోరం కన్వీనర్ చిరంజీవులు మీడియాతో మాట్లాడారు.