నలుగురు తెలుగు విద్యార్థులకు 100 పర్సంటైల్
ఉత్కంఠకు తెర దించుతూ జేఈఈ (మెయిన్) సెషన్ -2 ఫలితాలు వెల్లడయ్యాయి. ఎన్టీఏ ఫైనల్ కీ విడుదల చేశారు. విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోరుతో రిజల్ట్స్ ను ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్ -1 పరీక్షలు నిర్వహించారు. స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకొనేందుకు విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్తో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫలితాలలో ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. జేఈఈ మెయిన్ పరీక్షలకు దేశ వ్యాప్తంగా 10,61,849 మంది రిజిస్టర్ చేసుకోగా 9,92,350 మంది హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 24మంది విద్యార్థులు 100 పర్సంటైల్ స్కోరుతో అదరగొట్టారు.
వీరిలో ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ, తెలంగాణ నుంచి హర్ష్ ఎ.గుప్తా, వంగల అజయ్ రెడ్డి, బనిబ్రత మజీ ఉన్నారు. జేఈఈ (మెయిన్) పేపర్ -2 (బీఆర్క్/బి ప్లానింగ్) ఫలితాలను తర్వాత ప్రకటించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఇదిలా ఉండగా జేఈఈ (మెయిన్) సెషన్ 1, 2 పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు కేటాయించారు. ఆ తర్వాత సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత కల్పిస్తారు.