పనులు పరిశీలించిన టీటీడీ జేఈవో వీరబ్రహ్మం
ఒంటిమిట్ట – ఒంటిమిట్ట ఏకశిలా నగరంలో ఏప్రిల్ 5 నుండి 15 వరకు జరుగనున్న శ్రీ కోదండరామ స్వామి ఆలయం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల పనులను టిటిడి జేఈవో వి వీరబ్రహ్మం పరిశీలించారు. వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ డా.చెరుకూరి శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్ లతో కలసి సోమవారం కల్యాణ వేదిక ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం అధికారులకు పలు సూచనలు చేశారు. ముందుగా కల్యాణ వేదిక ప్రాంగణానికి చేరిన జేఈవో ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి జరుగుతున్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కల్యాణ వేదిక పక్కన ఉన్న పీఏసీ బిల్డింగ్ పనులను పరిశీలించారు.
ఏప్రిల్ 11వ తేదీన సీఎం నారా చంద్రబాబు నాయుడు కడప ఎయిర్ పోర్ట్ నుండి ఒంటిమిట్ట కల్యాణ వేదిక ప్రాంగణానికి చేరుకోనున్న నేపథ్యంలో ఆయా మార్గాలలో ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో చర్చించారు. బాకారాపేటలో పార్కింగ్ రోడ్ డైవర్షన్ మార్గాలను, భక్తులు ప్రవేశించే, నిష్క్రమణ మార్గాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ముందస్తుగా ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్యాలరీలలో భక్తులకు త్రాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు, సీతారాముల కళ్యాణం ముత్యపు తలంబ్రాలు ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు, అత్యవసర పరిస్థితుల్లో గ్యాలరీల నుండి బయటకు వచ్చేలా అత్యవసర మార్గాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద పెండింగ్ పనులు, మరమ్మతులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, దాదాపు 2 వేల మంది పోలీసు సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎలాంటి తొక్కిసలాటలకు అవకాశం లేకుండా క్షేత్ర స్థాయిలో పటిష్టంగా ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. కల్యాణ వేదిక ప్రాంతంలో జిల్లా కలెక్టర్ ఇచ్చిన పలు సూచనలకు తగ్గట్లుగా అత్యవసర వైద్య సేవలు, అంబులెన్సులు, అగ్నిమాపక, పోలీసు, అన్నప్రసాదాలు పంపిణీకి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని జేఈవో సూచించారు.
అనంతరం పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ, పోలీసు, టిటిడి అధికారుల సమావేశంలో శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో టిటిడి సీఈ సత్యనారాయణ, ఎస్ ఈలు వేంకటేశ్వర్లు, మనోహర్, కడప ఆర్డీవో జాన్ ఎర్విన్, జమ్మలమడుగు ఆర్డీవో సాయి శ్రీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.