విశిష్ట అతిథిగా హాజరుకానున్న సీఎం చంద్రబాబు
తిరుపతి – ఒంటిమిట్టలో ఏకశిలానగరంలో ఏప్రిల్ 5 నుంచి 15 వరకు 10 రోజుల పాటు శ్రీ కోదండరామస్వామి ఆలయం శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సీఎం చంద్రబాబు హాజరవుతారు. ఈ సందర్బంగా పనులను జేఈవో వి. వీరబ్రహ్మం పరిశీలించారు. కళ్యాణ వేదికను సందర్శించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కల్యాణ వేదిక పక్కన ఉన్న పీఏసీ బిల్డింగ్ పనులను పరిశీలించారు.
సీఎం కడప ఎయిర్ పోర్ట్ నుండి ఒంటిమిట్ట కల్యాణ వేదిక ప్రాంగణానికి చేరుకోనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో చర్చించారు. బాకారాపేటలో పార్కింగ్ రోడ్ డైవర్షన్ మార్గాలను, భక్తులు ప్రవేశించే, నిష్క్రమణ మార్గాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ముందస్తుగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్యాలరీలలో భక్తులకు త్రాగు నీరు, మజ్జిగ, అన్న ప్రసాదాలు, సీతారాముల కళ్యాణం ముత్యపు తలంబ్రాలు ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు, అత్యవసర పరిస్థితుల్లో గ్యాలరీల నుండి బయటకు వచ్చేలా అత్యవసర మార్గాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. .
ఎస్పీ మాట్లాడుతూ దాదాపు 2 వేల మంది పోలీసు సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎలాంటి తొక్కిసలాటలకు అవకాశం లేకుండా క్షేత్ర స్థాయిలో పటిష్టంగా ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. అత్యవసర వైద్య సేవలు, అంబులెన్సులు, అగ్నిమాపక, పోలీసు, అన్నప్రసాదాలు పంపిణీకి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని జేఈవో సూచించారు.