రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు
అమరావతి – రాష్ట్రంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దళితులపైన దాడులు కామన్గా మారాయని, వారిపై పోలీసుల అరాచకాలు కొనసాగుతున్నాయని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్రావు ధ్వజమెత్తారు. చట్టాలను కాపాడాల్సిన పోలీసులే వాటిని కాలరాస్తున్నారని వాపోయారు. తెనాలిలో దళిత, మైనారిటీ యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణమన్నారు. ప్రధానంగా రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోందని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
2019–24 మధ్య వైయస్ జగన్, తన పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి నిజమైన నిర్వచనం చెప్పి, దేశానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు. పేద వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చేందుకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. పేదలకు 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఒక్క అమరావతిలోనే 50 వేల మంది కోసం ఏకంగా 900 ఎకరాలు కేటాయించడం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులు ప్రపంచాన్ని ఏలగలరన్న నమ్మకం కలిగించారని అన్నారు.
నాడు– నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల్లో సమూల మార్పులు, కొత్తగా ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, మారుమూల గ్రామాల్లో కూడా నాణ్యమైన ఉచిత వైద్యం అందించేందుకు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చారని తెలిపారు. కానీ కూటమి సర్కార్ వచ్చాక సీన్ మారిందన్నారు. అణగారిన వర్గాల ప్రజలను మోసం చేయడం తప్పితే చేసింది ఏమీ లేదన్నారు.