హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం
తిరుపతి – తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందర రాజ స్వామివారి అవతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం 10 -11గం.ల మధ్య స్వామి వారికి కళ్యాణోత్సవం చేపట్టారు. మధ్యాహ్నం 3 – 4 గం.ల మధ్య శ్రీ కృష్ణ స్వామివారి ముఖ మండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి వైభవంగా అభిషేకం చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5.45 – 6.15 గం.ల మధ్య ఊంజల్ సేవ చేపట్టారు.. రాత్రికి 7 – 8.30 గం.ల మధ్య హనుమంత వాహనంపై నాలుగు మాడ వీధుల్లో స్వామి వారు విహరించారు.
ఇదిలా ఉండగా గురువారం నాటితో శ్రీ సుందర రాజ స్వామి వారి అవతార మహోత్సవాలు ముగియనున్నాయి. రాత్రి 7 – 8.30 గం.ల మధ్య గరుడ వాహనంపై స్వామి వారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. ఇదిలా ఉండగా ఉత్సవాల సందర్బంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు జేఈవో.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరింధ్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, ఆర్జితం ఇన్స్పెక్టర్ కె.చలపతి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.