ఒంటిమిట్ట ఆలయంలో ఘనంగా కార్యక్రమం
తిరుపతి – తిరుమల తిరుపతి దేవస్థానముల అనుబంధ ఆలయమైన కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో జ్యేష్ట మాసం పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై సీతారాముల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి బంగారు ఆభరణాలు, వర్ణమైన పుష్పమాలతో అలంకరించారు.
ముందుగా అర్చకులు విశ్వసేన పూజ, కలశ ప్రతిష్ట, కలశపూజ, వాసుదేవ పుణ్యా వచనం, కంకణ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీత పూజ, యజ్ఞోపవీత ధారణ, మధుపర్కం పట్టు వస్త్ర సమర్పణ, కన్యాదానం, మాంగల్య పూజ, మాంగల్య ధారణ, అక్షతరూపణ మాల మార్పిడి, వారణమయి మహా నివేదనం, కర్పూర హారతి కార్యక్రమాలను నిర్వహించారు.
ఒంటిమిట్ట సమీప ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని చూశారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, భక్తులు పాల్గొన్నారు. అంతకు ముందు కాళ్యాణోత్సవం సందర్బంగా టీటీడీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.