మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
అమరావతి – పర్యాటక రంగానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కందుల దుర్గేష్. ఏపీని టూరిజం హబ్ గా మారుస్తామన్నారు. స్పష్టమైన ప్లాన్స్ తో ముందుకు వెళుతున్నామని చెప్పారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రాన్ని పర్యాటకాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. పర్యాటక రంగంలో ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతర్జాతీయ పర్యాటక ప్రాజెక్టులపై అధ్యయనం జరుగుతోందని, ఎన్ఆర్ఐల భాగస్వామ్యంతో హోమ్ స్టేలను అభివృద్ది చేస్తామన్నారు.
తిరుపతి, విశాఖ, అమరావతి, శ్రీశైలం, రాజమహేంద్రవరంలో టూరిజం హబ్స్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారని చెప్పారు. శ్రీశైలంను మెగా ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించి స్థానికంగా ఉన్న సమూహాలను భాగస్వామ్యులుగా చేసి సమీపంలోని డ్యామ్, అటవీ ప్రాంతం, టైగర్ సఫారి లను కలుపుతూ సర్క్యూట్ గా అభివృద్ధి చేస్తామన్నారు.
త్వరలో రాష్ట్రంలో ఐల్యాండ్ ల అభివృద్ధి..హోటల్స్ ఏర్పాటుకు ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తామన్నారు కందుల దుర్గేష్. విజయవాడలోని భవానీ ఐల్యాండ్, కాకినాడ సముద్రంలోని హోప్ ఐల్యాండ్, రాజమహేంద్రవరం సమీపాన ఉన్న పిచ్చుకలంక, అమరావతి సమీపంలోని ఐల్యాండ్స్ ను అభివృద్ధి చేస్తామన్నారు. ఇక్కడ హోటల్స్ ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నామన్నారు.
ఎన్ఆర్ఐలను భాగస్వామ్యులను చేస్తూ జాయింట్ వెంచర్ గా రాష్ట్రంలో హోమ్ స్టేలను ఏర్పాటు చేయాలని సీఎం తెలిపినట్లు మంత్రి చెప్పారు. అదేవిధంగా కొండపల్లి, ఏటికొప్పాక, ఉప్పాడ, ధర్మవరం, మంగళగిరి, శ్రీకాళహస్తి తదితర ప్రాచీన హస్తకళా ఖండాలకు, చేనేత వస్త్రాలకు మరింత ప్రాచుర్యం కల్పించేలా హ్యాండీక్రాఫ్ట్స్ ను అనుసంధానం చేస్తామన్నారు. అంతేగాక ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించి ధృవీకరించిన ఉత్పత్తులు, వాటి నేపథ్యాన్ని వివరించేలా క్యూఆర్ కోడ్ ను ఏర్పాటుచేసి పర్యాటకులకు అతిథ్యం కల్పిస్తామన్నారు.