మంత్రి కందుల దుర్గేష్
అమరావతి – ఏపీ పర్యాటకుల గమ్య స్థానంగా మార బోతోందని స్పష్టం చేశారు మంత్రి కందుల దుర్గేష్.
సచివాలయంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు . అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులపై పర్యాటక శాఖ ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేశారు . జనవరిలో పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.
ప్రతిష్టాత్మకంగా హేవలాక్ వంతెన పునర్నిర్మాణం, అధ్యాత్మిక కేంద్రంగా పుష్కర్ ఘాట్ అభివృద్ధి చేయాలని సూచించారు కందుల దుర్గేష్. ఎకో టూరిజం సెంటర్ గా కడియం నర్సరీని తీర్చిదిద్దాలని అన్నారు.
గండికోటను అడ్వెంచర్ టూరిజం స్పాట్ గా మార్చాలని, నిడదవోలు కోట సత్తెమ్మ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులపై పర్యాటకుల ఫీడ్ బ్యాక్ తీసుకునేలా ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసి పర్యాటకులకు అనుకూలంగా ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు ప్రశాంతమైన వాతావరణంలో గడిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
ఏపీటీడీసీకి సంబంధించిన హరితా హోటళ్ల నిర్వహణ, పనితీరుపై మంత్రి దుర్గేష్ ఆరా తీశారు. త్వరితగతిన మరిన్ని హరితా హోటళ్లు పర్యాటకులకు అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. పర్యాటక ఉత్సవాలపై మంత్రి అధికారులను అడిగి సమాచారం తెలుసుకున్నారు.
పెట్టుబడిదారులతో ఏ ప్రాంతంలో కాన్ క్లేవ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అంశంపై ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. రుషికొండ బీచ్ కు బ్లూఫాగ్ బీచ్ సర్టిఫికెట్ వచ్చిందని రాష్ట్రంలోని మరిన్ని బీచ్ లకు బ్లూఫాగ్ బీచ్ గా గుర్తింపు పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.