వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి కందుల దుర్గేష్
కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రసాద్, స్వదేశీ దర్శన్ 2.0, శాస్కి స్కీమ్ ల సహకారంతో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి జరుగుతోందన్నారు మంత్రి కందుల దుర్గేష్. మంగళవారం సచివాలయంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో టూరిజం శాఖ ఎండీ ఆమ్రపాలి కాటతో కలిసి పాల్గొన్నారు. సింహాచలం ఆలయ అభివృద్ది పనులు 60 శాతం పూర్తయ్యాయని, అన్నవరం దేవాలయ అభివృద్దికి టెండర్ల ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు. ఎమ్మెల్సీ కోడ్ కారణంగా పనులు నిలిచి పోయాయని వెల్లడించారు.
స్వదేశ్ దర్శన్ 2.0 క్రింద బొర్రా గుహలు- లంబసింగి ప్రాజెక్టులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు . గండికోట ఫోర్ట్ కు సంబంధించిన టెండర్లు స్వీకరించడం జరిగిందన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టు అభివృద్ధి ప్రక్రియ ప్రస్తుతం టెండర్ దశలో ఉందని తెలిపారు.
స్వదేశీ దర్శన్ క్రింద అభివృద్ధి చేయదలచిన నాగార్జున సాగర్, అహోబిలం, సూర్యలంక ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ లను త్వరతితగతిన ఆమోదించమని కేంద్ర మంత్రిని అభ్యర్థించారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ . ఇందుకు సంబంధించి సానుకూలంగా స్పందించారు కేంద్ర మంత్రి.
ప్రసాద్ స్కీం క్రింద సింహాచలం ఆలయ అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని, తొలి విడత మంజూరైన నిధులను వినియోగించామని, 2,3వ విడత నిధులు మంజూరు చేయాలని కోరారు. 19 సెప్టెంబర్, 2024న నెల్లూరు వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి సంబంధించిన ప్రతిపాదనను పరిశీలించాలని విన్నవించారు. మంగళగిరి,అరసవెల్లి దేవాలయాల ప్రతిపాదలను ఆమోదించాలని కోరారు మంత్రి దుర్గేష్.