బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర కామెంట్
బెంగళూరు – రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హిందూ కార్యకర్తలను టార్గెట్ చేసి వేధింపులకు గురి చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ లా అండ్ ఆర్డర్ ను కాపాడడంలో పూర్తిగా విఫలం చెందిందని ఆరోపించారు. మత కలహాల తరువాత తీరప్రాంతంలో హిందూ కార్యకర్తలపై రాష్ట్ర పోలీసుల చర్యకు ప్రతిస్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంతలో, బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రతినిధి బృందం ఈ విషయంపై డిజి, ఐజిపి ఎం.ఎ. సలీమ్తో సమావేశమైంది. 36 మంది వ్యక్తుల బహిష్కరణ ఉత్తర్వులపై వ్యాఖ్యానించారు. పోలీసులు రాత్రిపూట హిందూ కార్యకర్తల తలుపులు తట్టి వారిని ప్రశ్నిస్తున్నారని వాపోయారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు . సీఎం , హోం శాఖ మంత్రి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. నిద్ర పోతున్నారా అని నిలదీశారు.
భవిష్యత్ పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. హిందూ కార్యకర్తలను కావాలని అవమానాలకు గురి చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రాచరిక పాలనను కొనసాగిస్తోందని ఆరోపించారు విజయేంద్ర.