శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి గుడిలో
తిరుపతి – శ్రీనివాస మంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 13వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. 18 నుండి 26వ తేదీ వరకు ఆలయంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 6.30 నుండి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు.
అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను సర్వ దర్శనానికి అనుమతిస్తారు.
ఇదిలా ఉండగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్బంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చర్యలు చేపట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసింది.