ప్రకాశం బ్యారేజ్ కు చేరుతున్న నీరు
అమరావతి – ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండు కుండలను తలపింప చేస్తున్నాయి. తాజాగా కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ కు స్వల్పంగా వరద నీరు పెరుగుతోంది.
ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 1,01,767 క్యూసెక్కులుగా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ కూర్మనాథ్ బుధవారం వెల్లడించారు. వివిధ ప్రాజెక్టుల నుంచి వరద నీటిని దిగువకు వదులుతున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా అంతకంతకూ వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతపు ప్రజలు , లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పంట్లు, నాటు పడవలతో ప్రయాణం చేయొద్దని కోరారు.
వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని సూచించారు కూర్మనాథ్. పశువులు, గొర్రెలు, మేకలు వంటి జంతువులను ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతలకు తరలించాలని పేర్కొన్నారు. అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లకు డయల్ చేయాలని కోరారు.