సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఫైర్
హైదరాబాద్ – తమ న్యాయ పరమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేపట్టిన ఆశా సోదరీమణులు, తల్లులపై అకారణంగా పోలీసులు దాడులకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ తల్లులపై ఏమిటీ దుర్మార్గం అంటూ నిప్పులు చెరిగారు. సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు.
ఆశా వర్కర్లు మీకు తల్లుల్లా కనిపించడం లేదా , మాతృమూర్తులపై మగ పోలీసులతో దౌర్జన్యం చేయించడం దారుణమన్నారు. ఏం పాపం చేశారని నడిరోడ్డుపై లాగిపారేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్. దళిత, బహుజన ఆడబిడ్డలపై ఇంతటి అరాచకం పాల్పడడం అన్యాయమని అన్నారు.
హోంమంత్రిగా ఉన్న మీకు ఆడవాళ్లంటే అంత చులకనా ? ఇందిరమ్మ రాజ్యమంటే అణచివేతలు, అక్రమ అరెస్టులేనా అని సీఎంను ఉద్దేశించి ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలకు దిక్కులేదు కానీ..ఏడో గ్యారెంటీగా ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
మీ సర్కారు దాష్టీకానికి ఆశా నాయకురాలు.. సంతోషిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఆమెకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు కేటీఆర్.