ఆరు గ్యారెంటీలు బక్వాస్
మహబూబాబాద్ – రైతులకు సంబంధించి ఇచ్చిన ప్రభుత్వం హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారని, కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలేదని వాపోయారు.
ఈ సందర్బంగా కొనుగోలు కేంద్రంలో ఉన్న రైతులతో ముచ్చటించారు. రైతుల బోనస్ ఇప్పటి వరకు ఇవ్వలేదని దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులకు రావాల్సిన వచ్చినవన్నీ ఇవ్వడం జరిగిందన్నారు కేటీఆర్.
రేవంత్ రెడ్డి వచ్చాక రైతుబంధు ఎగ్గొట్టిండని ఆరోపించారు. పింఛన్ పెంచ లేదని మండిపడ్డారు. బోనస్ బోగస్ అయ్యిందంటూ ధ్వజమెత్తారు మాజీ మంత్రి. ఆడబిడ్డలకు మహాలక్ష్మి స్కీం వచ్చిందా అని ప్రశ్నించారు.
మహారాష్ట్రకు పోయి కూడా ఆడబిడ్డలను మోసం చేసే ప్రయత్నం చేస్తే అక్కడి తగిన రీతిలో సీఎం కు గట్టిగా బుద్ది చెప్పారంటూ ఎద్దేవా చేశారు. తాను ఇక్కడ వస్తుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతమని అంటున్నారని, మరి డీజీపీ, ఎస్పీ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
కేసులు తమ మీద మాత్రమే పెడుతారా? కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద కేసులు ఉండవా అంటూ నిలదీశారు.
మానుకోట రాళ్ల మహత్యం ఏందో తెలంగాణను అడ్డుకున్న వాళ్లందరికీ తెలుసన్నారు.