సవాల్ విసిరిన టీపీసీసీ చీఫ్
హైదరాబాద్ – టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి కేటీఆర్ పై భగ్గుమన్నారు. ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలకడం ఆపేసి దమ్ముంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. చెల్లెలు కవిత, బావ హరీశ్ రావు ఇచ్చిన షాక్ తట్టుకోలేక మతిభ్రమించి మాట్లాడుతున్నాడంటూ మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంపై చర్చకు సిద్దమా అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
మంగళవారం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. మీ నాయిన ,మీ బావ, నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజలు గుండు సున్నాతో బుద్ధి చెప్పిన విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లోను గాడిద గుడ్డు వస్తదని తెలిసే.. మీ పార్టీ ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించలేదంటూ ఎద్దేవా చేశారు టీపీసీసీ చీఫ్. బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని సీఎం రేవంత్, మంత్రుల బృందం పునర్వికాసం వైపు నడిపిస్తోందన్నారు.
మూడు ముక్కలుగా చీలిన బిఆర్ఎస్ పార్టీ..వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో కనిపించకుండా పోతుందని జోష్యం చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. పదేళ్ల బిఆర్ఎస్ పాలన … ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.