ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
ఖమ్మం జిల్లా – సంపదను సృష్టించి పేదలకు పంచుతామని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఆరు నూరైనా సరే ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఆరోపించారు. అర్హులైన లబ్దిదారులకు సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు తమ పాలన పట్ల సంతోషంగా ఉన్నారని చెప్పారు.
ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా సంక్షేమ పథకాల మంజూరుకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పరమ పవిత్రమైన ఈరోజు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు మల్లు భట్టి విక్రమార్క.
రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఒక గ్రామంలో నూరు శాతం అందిస్తూ లాంచనంగా పథకాలను స్టార్ట్ చేశామన్నారు. నాలుగు సంక్షేమ పథకాలు వినబడడానికి చిన్నగా ఉండొచ్చు కానీ ఈ పథకాల అమలుకు ఏడాదికి 45 వేల కోట్లు భారం పడుతుందన్నారు. అయినా ప్రజలందరికీ మంచి చేయాలని పథకాల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు డిప్యూటీ సీఎం.
గత పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని పాలకుల కోసమే వాడుకున్నారని, ప్రజలను పట్టించు కోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.