54 రన్స్ తేడాతో ఘన విజయం
ముంబై – ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు ఝలక్ ఇచ్చింది ముంబై ఇండియన్స్. 54 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో సత్తా చాటింది. హార్దిక్ పాండ్యా సేన అన్ని రంగాలలో రాణించింది. వరుసగా 5వ విజయాన్ని నమోదు చేసింది. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టులో రికల్టన్ , సూర్య హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. లక్నో బౌలర్లకు చుక్కలు చూపించారు.
రికల్టన్ 32 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్సర్లతో 58 రన్స్ చేయగా సూర్య కుమార్ యాదవ్ 28 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్లతో 54 రన్స్ చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 215 రన్స్ చేసింది. అనంతరం లక్నో 161 పరుగులకే కుప్ప కూలింది. ఆయుష్ బదోని 35 రన్స్ చేయగా మిచెల్ మార్ష్ 34 రన్స్ చేశాడు. మిగతా వారంతా పెవిలియన్ బాట పట్టారు. ముంబై బౌలర్లు బుమ్రా 22 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీశాడు. లక్నో జట్టు పతనాన్ని శాసించాడు. ట్రెంట్ బౌల్ట్ 20 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. బ్యాట్ తో పాటు బంతితోనూ సత్తా చాటాడు విల్ జాక్స్ . 29 పరుగులతో పాటు 18 రన్స్ ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు.