మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడి
అమరావతి – రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశంపై తమ ప్రభుత్వం పరిశీలన జరుపుతోందన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. సభ్యులు కొణతాల రామక్రిష్ణ, కాల్వ శ్రీనివాసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఏ మండలంలో రేషన్ కార్డు ఉంటే ఆ మండలంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలం ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. భూ సంబంధ అంశాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై అధ్యయనం చేసి సిఫార్సు చేస్తుందన్నారు మంత్రి అనగాని సత్య ప్రసాద్.
జర్నలిస్టులను ప్రత్యేక వర్గంగా భావించి ఇళ్ల స్థలాలను తక్కువ రేటుకు ఇవ్వడం సరైంది కాదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇళ్ల పట్టాలు ఎలా ఇవ్వాలా అనే దానిపై కసరత్తు చేస్తున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం జర్నలిస్టులను కూడా మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు జర్నలిస్టులకు ఇళ్లపట్టాలు ఇస్తామంటూ జగన్ రెడ్డి ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు.
జర్నలిస్టులపై భారం మోపేలా ఇళ్ల పట్టాల జీవోను ఇచ్చిందని ఆరోపించారు అనగాని సత్య ప్రసాద్. ఇళ్ల పట్టాల మంజూరులోనూ అనేక కఠిన షరతులు పెట్టిందన్నారు. ఒక్క జర్నలిస్టుకు కూడా ఇళ్ల పట్టా ఇవ్వలేక పోయిందన్నారు.