హోం, విపత్తునిర్వహణ శాఖ మంత్రి అనిత
అమరావతి – గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరివల్లే ఏపీకి విపత్తులు వస్తున్నాయని ఆరోపించారు మంత్రి వంగలపూడి అనిత. వడగాల్పులు, రాబోయే వర్షాకాలానికి సంసిద్ధతపై చర్చించారు. వాతావరణ మార్పులకు తగ్గట్లు అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలన్నారు. ప్రణాళికతో సమయం నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలన్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగి వడగాల్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. గతేడాది నంద్యాలలోని గోస్పాడులో అత్యధికంగా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందన్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
2025 ఏప్రిల్లో పల్నాడు జిల్లా నరసరావుపేటలో 43.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందన్నారు. 2014,15,16 సంవత్సరాల్లో అత్యధికంగా 49.1, 50.3,48.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. తాగునీటి అవసరాలపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా అప్రమత్తంగా ఉన్నామని, 100 రోజుల యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు సీడీఎంఏ డైరెక్టర సంపత్.రాబోయే రోజుల్లో వడగాల్పులకు గల అవకాశాలపై హోంమంత్రి ఆరా తీశారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నీటి నిల్వ చేసినట్లు తెలిపారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు.92 మండలాలను ముందస్తుగా గుర్తించి ప్రాంత ప్రజలకు నీటి కష్టాలు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
పాఠశాలల్లో నీటితో పాటు, ఎన్జీవో, విరాళాల ద్వారా మజ్జిగ పంపిణీ చేస్తామన్నారు. వడగాల్పుల ద్వారా వడదెబ్బ బారిన పడిన వారి చికిత్స కోసం 5,145 పడకలను, 768 అంబులెన్సులు, సిద్ధం చేయడమే కాకుండా వైద్యులకు తగు శిక్షణనిచ్చి అప్రమత్తంగా ఉంచినట్లు పేర్కొన్నారు వైద్యాధికారి. వడదెబ్బ మరణాలు లేకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సచివాలయం, వార్డు సచివాలయం, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను అప్రమత్తం చేసినట్లు వివరించారు విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్. రాష్ట్ర వ్యాప్తంగా 20 నగరాలలో వడగాల్పుల అప్రమత్తత దిశగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. మృతి చెందిన వారికి రూ.4 లక్షల పరిహారం ఇస్తామన్నారు మంత్రి వంగలపూడి అనిత.